వెల్లంకి నుంచి జాతీయ స్థాయికి.. రగ్బీలో దూసుకెళ్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.
వెల్లంకి నుంచి జాతీయ స్థాయికి.. రగ్బీలో దూసుకెళ్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.
Editor Desk
ఉమ్మడి జిల్లా జట్టుకు ఏడుగురు ఎంపిక.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ.
ప్రధానోపాధ్యాయుడు, పీడీ కృషితో వెలుగులోకి వస్తున్న క్రీడాకారులు.
రామన్నపేట
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అవకాశాలు కల్పిస్తే ఏ స్థాయిలోనైనా రాణించగలరని రామన్నపేట మండలం వెల్లంకి పీఎంశ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరోసారి నిరూపించారు. రగ్బీ క్రీడలో వరుస విజయాలు నమోదు చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేస్తున్నారు. మూడేళ్లుగా అందుతున్న ప్రణాళికాబద్ధమైన శిక్షణ ఫలితంగా ఈ పాఠశాల క్రీడాకారులు రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకుని జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారు.
2024 జిల్లాస్థాయి పోటీల్లో వెల్లంకి పాఠశాల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఏకంగా ఏడుగురు విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికై జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లోనూ తమ ప్రతిభను కొనసాగించారు.
పాఠశాలకు చెందిన గూని రిబ్కా తెలంగాణ జట్టుకు ఎంపికై జాతీయ రగ్బీ పోటీల్లో పాల్గొనడం పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన 75వ జూనియర్ నేషనల్ రగ్బీ ఛాంపియన్షిప్లోనూ ఆమె ప్రతిభ కనబరిచింది.
అలాగే భువనేశ్వర్లో నిర్వహించిన 69వ జాతీయ రగ్బీ పోటీల్లో (అండర్–14) ఆడెపు అలేఖ్య, మేకల నాగసుప్రియ తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆకట్టుకున్నారు. రగ్బీతో పాటు ఫుట్బాల్లోనూ మేకల సహస్ర అంతర్జిల్లా పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు తరఫున ఆడి ప్రతిభ చాటింది.
కృషికి ఫలితం
ప్రధానోపాధ్యాయుడు టి. సురేందర్రెడ్డి, పీడీ అంబటి రేణుక విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం మైదానంలోనే ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. వారి అంకితభావమే నేడు విద్యార్థులను జిల్లా నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.
'సార్, మేడమ్ ప్రోత్సాహమే నా బలం'
"ఆటలపై ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థిని మా ప్రధానోపాధ్యాయుడు, పీడీ ఎంతో ప్రోత్సహిస్తారు. ప్రత్యేక శిక్షణ వల్లే నేను జాతీయ స్థాయికి చేరాను. రగ్బీతో పాటు యోగా, కరాటేలోనూ శిక్షణ ఇస్తున్నారు." అని జాతీయస్థాయి క్రీడాకారిణి గూని రిబ్కా తెలిపింది.వెల్లంకి పీఎంశ్రీ ఉన్నత పాఠశాల సాధిస్తున్న విజయాలు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతిభకు కొదవ లేదని మరోసారి చాటిచెబుతున్నాయి.
“ నిరంతర కృషితోనే సత్ఫలితాలు.
సురేందర్ రెడ్డి , ప్రధానోపాధ్యాయుడు, వెల్లంకి పీఎంశ్రీ పాఠశాల
మా పాఠశాల పీడీ అంబటి రేణుక నిరంతరం గ్రౌండ్ లోనే గడుపుతారు. ఉద యం పాఠశాలకు ముందు గానే వచ్చి, సాయంత్రం అందరి కంటే చివరగా వెళ్తారు. పిల్లలతో మమేకమై క్రీడల్లో మెళకువలు నేర్పిస్తున్నారు. ఆమె కృషి ఫలితంగానే నేడు విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై రాణిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తు లు అందిస్తున్న సహకారం మరువలేనిది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి