సోలార్ వాడితే 'షాక్' కొడుతోంది.!
సోలార్ వాడితే 'షాక్' కొడుతోంది.!
NM Yadav
ప్రభుత్వం ప్రోత్సాహం విద్యుత్ శాఖ వైఖరితో నిరాశ..
నెట్ మీటరింగ్లో సవాలక్ష గందరగోళం..
వాడని కరెంటుకు వేలల్లో బిల్లులు చెల్లించలేదని కనెక్షన్ కట్..
నల్గొండ మండలంలో సోలార్ వినియోగదారుడికి రూ.7,280 బిల్లు..
అధికారుల చుట్టూ తిరిగినా స్పందన శూన్యం..
నల్గొండ : పర్యావరణ పరిరక్షణతో పాటు నెలవారీ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఒకవైపు ప్రభుత్వం విరివిగా ప్రచారం చేస్తోంది. కానీ, మరోవైపు క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ అధికారులు అనుసరిస్తున్న తీరు సోలార్ వినియోగదారుల పాలిట శాపంగా మారుతోంది. లక్షలు వెచ్చించి ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే.. బిల్లుల భారం తగ్గడం అటుంచి, అదనపు బాదుడుతో చుక్కలు కనిపిస్తున్నాయని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రిడ్కు విద్యుత్ ఇచ్చినా భారీగా బిల్లులు..
నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన ఒక వినియోగదారుడు తన ఇంటి అవసరాల కోసం ఏకంగా 6 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ను, రెండు మీటర్లతో ఏర్పాటు చేసుకున్నాడు. ఎండ కాలంలో ఉత్పత్తి ఎక్కువై, తన ఇంటి వినియోగం కంటే అదనంగా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు సరఫరా అవుతోంది. నియమావళి ప్రకారం 'నెట్ మీటరింగ్' పద్ధతిలో మిగులు విద్యుత్ను మినహాయించి బిల్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఆయనకు మాత్రం సంబంధిత శాఖ నుంచి రూ.7,280 బిల్లు వచ్చింది. తాను ఉత్పత్తి చేసిన విద్యుత్కు ఒక యూనిట్ చొప్పున తక్కువ రేటును గ్రిడ్ నుంచి వాడిన విద్యుత్కు అధిక రేటును లెక్కిస్తూ డిపార్ట్మెంట్ విపరీతమైన బిల్లులు జారీ చేస్తోందని బాధితుడు ఆరోపిస్తున్నారు.
అధికారుల అలసత్వం కనెక్షన్ కట్..
ఈ అన్యాయమైన బిల్లుపై వివరణ కోరడానికి బాధితుడు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించినా ఎలాంటి స్పష్టమైన సమాధానం లభించలేదు. గందరగోళాన్ని సరిదిద్దకుండానే, బిల్లు చెల్లించలేదనే సాకుతో ఏకంగా ఆయన ఇంటి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయడం గమనార్హం."లక్షల రూపాయలు అప్పులు చేసి సోలార్ వ్యవస్థను నెలకొల్పాం. కరెంటు బిల్లు తగ్గుతుందని ఆశిస్తే, నెలకు వేల రూపాయల భారం పడుతోంది. పైగా ప్రశ్నిస్తే కరెంటు కట్ చేశారు."
— బాధితుడి ఆవేదన
పర్యవేక్షణ ఏది?
ఈ ఘటనపై వివరణ తీసుకునేందుకు నల్గొండ రూరల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (DE) ని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. సబ్సిడీలు ఇస్తూ ప్రభుత్వం ఒకవైపు ప్రోత్సహిస్తుంటే, టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) అధికారుల నిర్లక్ష్యం వల్ల సోలార్ విద్యుత్ వాడకంపై ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి నెట్ మీటరింగ్ విధానంలో లోపాలను సరిదిద్ది బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి