సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతి రావు పూలే
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతి రావు పూలే
Biksham
పూలే ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సూర్యాపేట: సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే అని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎం జి రోడ్డు వృత్తం వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే సీతారామా రావుతో కలిసి పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పూలే జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప గౌరవమని అన్నారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కుల, మత భేదాలు ఎక్కువగా ఉన్న కాలంలో సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు పూలే అని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయికి విద్యాబోధన చేసి, ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్తగా గుర్తు చేశారు. కుల వివక్షకు గురైన వర్గాలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు.
అదనపు కలెక్టర్ కే సీతారామా రావు మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ విద్యను పొందాలని పూలే బోధించిన సిద్ధాంతాలను గుర్తు చేశారు. మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అపారమని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. పూలే ఆశయాలను స్మరించుకొని మంచి సమాజ నిర్మాణం కోసం వారు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగాధికారి వేణు మాధవరావు, సహాయ పోలీసు కమిషనర్ ప్రసన్న కుమార్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి