సాగుకు యూరియా పుష్కలంగా ఉంది: మంత్రి తుమ్మల
సాగుకు యూరియా పుష్కలంగా ఉంది: మంత్రి తుమ్మల
స్థానికం బృందం
రైతుల ఆందోళనకు తెర: యూరియా అందుబాటులో ఉందన్న మంత్రి
స్థానికం ప్రతినిధి
రాష్ట్రంలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో యూరియా సరఫరా, పంపిణీపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్యచరణ ప్రణాళిక ప్రకారం రైతులకు యూరియాను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పంపిణీ చేయాలని ఆదేశించారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ను పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నల్గొండ, జనగామ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో మొదటగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. యాప్ పనితీరుపై రైతుల అభిప్రాయాలు తెలుసుకుని మెరుగుదలలు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు నీడ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని, సరఫరాలో అవకతవకలు జరగకుండా ప్రత్యేక అధికారులతో నిరంతర పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5770 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పట్టాదారు పాసుపుస్తకంలో నమోదైన భూ విస్తీర్ణం మేరకే యూరియా ఇవ్వాలని, అవసరానికి మించి పంపిణీ చేయవద్దని మంత్రి స్పష్టం చేశారు.
వ్యవసాయ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సభ్యసాచి గోష్ మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, యూరియా యాప్ ద్వారా ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ పంపిణీకి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి యూరియా పంపిణీ కేంద్రంలో కనీసం మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, 10 రోజుల్లో యూరియా బుకింగ్ మొబైల్ యాప్ అమల్లోకి వస్తుందని తెలిపారు. రోజువారీ పంపిణీ, మిగిలిన నిల్వలపై పూర్తి నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి