రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
Editor Desk
హయత్నగర్: హయత్నగర్–తారమతిపేట్ 100 అడుగుల రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కోరారు. శుభోదయ కాలనీకి చెందిన బాధితులతో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మదర్ డెయిరీ సమీపంలో ప్రభుత్వం గతంలో కేటాయించిన 60 గజాల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణతో తమ ఇళ్లు పూర్తిగా ప్రభావితమవుతున్నాయని, దీంతో వందకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎదురుగా ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమి వైపు నుంచి విస్తరణ చేపట్టి తమ ఇళ్లను కాపాడాలని ఎంపీని కోరారు.
వినతిని స్వీకరించిన ఎంపీ ఈటల రాజేందర్.. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయకుండా, వారి ఇళ్లు, జీవనాధారం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. శుభోదయ కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బాధిత కుటుంబాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి