మత విద్వేషాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోంది: బండారు రవికుమార్
మత విద్వేషాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోంది: బండారు రవికుమార్
Editor Desk
జంతర్మంతర్ ఘటనపై కేంద్రంపై విమర్శలు.
విద్యార్థులపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే – రాజకీయ శిక్షణా తరగతుల్లో సీపీఎం నేత వ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలతో దేశ ప్రజలపై భారాలు మోపుతూ, మరోవైపు ప్రజాస్వామ్య హక్కులను హరిస్తోందని ఆయన ఆరోపించారు.
రామన్నపేటలోని ఎంజీ గార్డెన్లో శనివారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు.
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసు దాడిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని, అలాంటి ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విద్యార్థి నాయకులపై కక్షసాధింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని, నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు.
శిక్షణా తరగతులకు ముందు సీపీఎం సీనియర్ నాయకుడు పబ్బతి లింగయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కచం కృష్ణమూర్తి 20వ వర్ధంతి, మాజీ సీపీఎం మండల కమిటీ సభ్యుడు పిట్టల శ్రీనివాస్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయాలు, త్యాగస్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల హక్కుల సాధన కోసం మరింత కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, జంపాల అండాలు, కల్లూరి నగేష్, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, గన్నేబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, మీర్ ఖాజా అలీ, నాగటి ఉపేందర్, వేముల సైదులు, ఎండీ రషీద్, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, డీవైఎఫ్ఐ నాయకులు శానాగొండ రాము, మెట్టు శ్రవణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద్తో పాటు నాగటి లక్ష్మణ్, పులి బిక్షం, శానాగొండ వెంకటేశ్వర్లు, జితేందర్, కొమ్ము అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి