Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 10, 2026 01:11 AM

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు : కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ అమలు

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు : కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ అమలు

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు : కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ అమలు
March 09, 2026 07:01 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్‌టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన రేషన్ మాఫియా డాన్ కాజా సత్యనారాయణ (50) పై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) అమలు చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా మళ్లించడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, ప్రభుత్వ అధికారులను బెదిరించడం వంటి చర్యలతో ప్రజల ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు.

ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఐపీఎస్ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ మార్చి 7న కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం నందిగామ, మైలవరం సబ్ డివిజన్ పరిధిలో లబ్ధిదారులు మరియు కొంతమంది డీలర్ల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. వీరులపాడు, కంచికచర్ల ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసి ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాజా సత్యనారాయణ 2011లో తొలిసారిగా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతనిపై మొత్తం 41 కేసులు నమోదయ్యాయి. ఎన్‌టీఆర్ జిల్లా తో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయి. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో అతనిపై రౌడీ షీట్ కూడా నమోదు చేశారు.

మార్చి 1న తహసీల్దార్ అందించిన సమాచారం మేరకు కంచికచర్ల–జూజ్జూరు రోడ్డుపై ఒక వాహనాన్ని అధికారులు అదుపులోకి తీసుకుంటుండగా కాజా సత్యనారాయణ తన అనుచరులతో కలిసి అధికారులను అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడి వాహనాన్ని తీసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వీరులపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మరుసటి రోజు డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా జయంతి గ్రామంలోని ఒక షెడ్‌పై దాడి చేసి 147.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఎనిమిది వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థకు నష్టం కలిగించే ఆర్థిక నేరగాళ్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు హెచ్చరించారు. నగర ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112, 7328909090 నంబర్లకు తెలియజేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News