నాగార్జునసాగర్, ఆగస్టు 10: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, తెలంగాణ సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున మహా వరుణయాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి దంపతులు రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వైదిక సంప్రదాయ పద్ధతిలో వరుణయాగం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య భక్తిశ్రద్ధలతో యాగ కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు కూడా యాగంలో పాల్గొన్నారు.
నదులు, ప్రాజెక్టులు నిండాలని ప్రార్థన
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవాలని సీఎం రేవంత్రెడ్డి వరుణదేవుడిని ప్రార్థించారు. ప్రతి చెరువు, కుంట నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండుతూ రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, పి. సుదర్శన్రెడ్డి, మాజీ మంత్రి కే. జానారెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి