అక్రమ అరెస్టులను ఖండించిన విద్యార్థి, యువజన సంఘాలు
ఉద్యోగాలు భర్తీ చేయాలి.. స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి
నల్గొండ, ఆగస్టు 10:
ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా డీవైఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గాదేపాక సాయి తేజలను నల్గొండ టూటౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అందక పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, అక్రమ అరెస్టులకు స్వస్తి పలికి విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి