రామన్నపేట, ఆగస్టు 10: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో జైలు భరో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల రుణభారం తగ్గించి సమగ్ర మద్దతు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు పని దినాలు, కూలి రేట్లు పెంచాలని కోరారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఐక్యంగా పోరాడి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాస్తారోకో చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రామన్నపేట పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్టులను నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో గన్నేబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, కందుల హనుమతు, నకిరకంటి రాము, కల్లూరి నగేష్, మేడబోయిన శ్రీనివాస్, అవనగంటి నగేష్, బావండ్లపల్లి బాలరాజు, మునికుంట్ల లెనిన్, మేడి గణేష్, అప్పం సురేందర్, తాళ్లపల్లి జితేందర్, నాగటి లక్ష్మణ్, శానగొండ వెంకటేశ్వర్లు, బందెల బిక్షం, బుడ్డ ప్రసాద్, పల్లె సత్యం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి