నల్గొండ, ఆగస్టు 10: దేశ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం సోమవారం పూర్ణాహుతితో ప్రశాంతంగా ముగిసింది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది ఋత్వికులు, అర్చకుల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున 4.05 గంటలకు మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి దంపతుల చేతుల మీదుగా యాగం ప్రారంభమైంది. గోపూజతో ప్రారంభమైన యాగంలో యాగ ప్రదక్షిణ, పుణ్యాహవచనం, అంకురార్పణం, ఋష్యశృంగ పూజ తదితర కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
కృష్ణా నది ఒడ్డున చతుర్విధ పారాయణంతో సాగిన వరుణ యాగంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో, మేళతాళాల నడుమ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 3.24 గంటలకు పూర్ణాహుతితో యాగం ముగిసింది.
సీఎంకు ఘన స్వాగతం
అంతకుముందు నాగార్జునసాగర్కు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
వరుణ యాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సుదర్శన్రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి