వెలుగోడులో ఏఐఆర్కేఎస్ ఆధ్వర్యంలో ధర్నా
వెలుగోడు మండలంలోని ప్రభుత్వ భూములను గుర్తించి భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐఆర్కేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. వెలుగోడు గ్రామంలోని సర్వే నంబర్ 1706లో ఉన్న 333.59 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని కోరుతూ సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ముందుగా కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి, కామ్రేడ్ మండల సుబ్బారెడ్డి స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు 300 మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పెద్ద ఎత్తున ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుప్రియకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ఏఐఆర్కేఎస్ జిల్లా కోశాధికారి కే. లాలూనాయక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. నరసింహులు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. మణి మాట్లాడుతూ. తెలంగాణ సాయుధ పోరాటం, గోదావరి లోయ ప్రతిఘటన, శ్రీకాకుళం రైతాంగ పోరాటాల ఫలితంగా భూసంస్కరణ, భూ పరిమితి చట్టాలు వచ్చాయని తెలిపారు. అయితే పాలక ప్రభుత్వాలు భూమిలేని పేదలకు భూములు పంచడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
వెలుగోడులోని సర్వే నంబర్ 1706లోని 333.59 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రతి పేద కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేయాలని కోరారు. గుంతకందాల గ్రామంలో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు కేటాయించిన భూములను కొందరు పెత్తందారులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రీ-సర్వేలో బయటపడిన ప్రభుత్వ భూములను కూడా గుర్తించి పేదలకు పంచాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి భూముల కోసం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెలుగోడు జగనన్న కాలనీలో మిగిలిన 200 ఇంటి స్థలాలను నిరుపేదలకు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఆర్కేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కె. ఆనందరావు, వెలుగోడు మండల అధ్యక్షుడు నందివర్గం విజయ్, మండల కార్యదర్శి షేక్ వడ్ల హుస్సేన్, నాగలక్ష్మినాయక్, రుద్రమణి, శాంతి, శివమ్మ, హుషన్బీ, అత్తరున్నిసా, విజయలక్ష్మీభాయి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి