రాష్ట్ర బడ్జెట్పై సిపిఎం విమర్శలు
రాష్ట్ర బడ్జెట్పై సిపిఎం విమర్శలు
Editor Desk
మోత్కూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రామీణ పేదలు, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి విమర్శించారు. ఆదివారం మోత్కూర్ మండలం రాగిబావి గ్రామంలో సిపిఎం గ్రామశాఖ సమావేశం ఎన్నం వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొల్లు యాదగిరి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆత్మీయ భరోసా వంటి పథకాల అమలుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు అంశం ప్రస్తావనే లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పథకానికి రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గ్రామీణ పేదలను మోసం చేయడమేనని విమర్శించారు. ఈ పథకాన్ని 2005లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నిధులు కేటాయించకపోవడం విచారకరమని అన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో నిధులు ఉంటాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.600 కోట్లు మాత్రమే కేటాయించడం సరైంది కాదన్నారు. కౌలు రైతులకు రూ.15 వేలు, ప్రతి మహిళకు రూ.2500, తులం బంగారం వంటి హామీలపై ఆర్థిక మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు.
ఈ బడ్జెట్ గ్రామీణ పేదలు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించినదిగా చరిత్రలో నిలిచిపోతుందని బొల్లు యాదగిరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు పానుగుల రమేష్, ఉపసర్పంచ్ పానుగుల లక్ష్మి, ఎన్నం వెంకట్ రెడ్డి, మెండు శేఖర్ రెడ్డి, ఎన్నం కలమ్మ, గానగాని అండాలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి