రామన్నపేట ఆసుపత్రి కోసం సిపిఎం నిరవధిక దీక్షలు
రామన్నపేట ఆసుపత్రి కోసం సిపిఎం నిరవధిక దీక్షలు
స్థానికం బృందం
వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.40 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్లు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
మండలానికి చెందిన ఎనిమిది మంది సిపిఎం నాయకులు దీక్షలో కూర్చుండగా, జహంగీర్ మరియు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలకు గత 56 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి ప్రస్తుతం పాత భవనంలో ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగుతోందని అన్నారు.
ఏరియా ఆసుపత్రిగా బోర్డు పెట్టి దాదాపు పది సంవత్సరాలు గడిచినా అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. 50 పడకల ఆసుపత్రి కోసం అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శిలాఫలకం వేసి మూడు సంవత్సరాలు గడిచినా నిధులు విడుదల కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి ప్రథమ చికిత్స, పోస్టుమార్టం సేవలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ సుమారు 400 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నప్పటికీ డాక్టర్లు, సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ సదుపాయం కూడా లేక ప్రతి సారి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్లు కేటాయించి 100 పడకల నూతన ఆసుపత్రి భవనం నిర్మించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని హెచ్చరించారు.
నిరవధిక నిరాహార దీక్షలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లా పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూర నరసింహాచారి, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు గొరిగె సోములు, నాగటి ఉపేందర్, వేముల సైదులు, చానకొండ రాము పాల్గొన్నారు.
దీక్షలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫజల్ బేగ్, నకిరేకంటి గణేష్, దండగుల రాములు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నోముల చిరంజీవి, గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు గాజుల ఆంజనేయులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, బోయిని ఆనంద్, కల్లూరి నగేష్, జంపాల అండాలు, గన్నేబోయిన విజయభాస్కర్, నీల అయిలయ్య, ఎండీ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి