విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఎంజీయూలో స్పోర్ట్స్ బోర్డు సమావేశం.. 26 క్రీడాంశాల బడ్జెట్కు ఆమోదం
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అభివృద్ధికి సంబంధించిన కీలక సమావేశం ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 26 క్రీడా అంశాల స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలిపారు.
సమావేశంలో విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, విద్యార్థులకు ఆధునిక క్రీడా సౌకర్యాల కల్పన, క్రీడా మౌలిక వసతుల విస్తరణ, అంతర్విశ్వవిద్యాలయ క్రీడా పోటీల సమర్థ నిర్వహణ, క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహక కార్యక్రమాలు వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. రానున్న విద్యా సంవత్సరంలో క్రీడా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందించేందుకు యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన క్రీడా వేదికలు, శిక్షణ సదుపాయాలు, పోటీల నిర్వహణకు అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
విశ్వవిద్యాలయం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్పోర్ట్స్ బోర్డు సభ్యులు, వివిధ కళాశాలల ప్రతినిధులు, క్రీడా విభాగం అధికారులు పాల్గొని క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి