రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొనుగోలు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ తడిసిన ధాన్యాన్నీ సేకరిస్తాం : మంత్రి ఉత్తమ్
రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొనుగోలు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ తడిసిన ధాన్యాన్నీ సేకరిస్తాం : మంత్రి ఉత్తమ్
Editor Desk
భువనగిరి
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్నీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతుల పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు వచ్చినా ధాన్యం సేకరణ ఆపబోమన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. వరి ధాన్యం రికార్డు స్థాయిలో దిగుబడి రావడంతో సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు.
రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదాములకు ధాన్యం తరలింపులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఇసుక వాహనాలను ధాన్యం రవాణా, అన్లోడింగ్ కోసం వినియోగించుకోవచ్చన్నారు.
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్లో వరి పంట అద్భుతంగా వచ్చిందన్నారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో భారీ మొత్తంలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని స్పష్టం చేశారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతుల పక్షాన ప్రభుత్వం ఉందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2,75,686.220 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి