Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 09:26 AM

రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం – మైలవరం నియోజకవర్గంలో రైతుల ఖాతాల్లో రూ.16.80 కోట్లు జమ

రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం – మైలవరం నియోజకవర్గంలో రైతుల ఖాతాల్లో రూ.16.80 కోట్లు జమ

రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం – మైలవరం నియోజకవర్గంలో రైతుల ఖాతాల్లో రూ.16.80 కోట్లు జమ
March 14, 2026 07:17 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా మైలవరం: రైతు సోదరులకు ఇచ్చిన హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలోని రైతులకు “పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ” పథకం కింద మూడో విడతగా రూ.16.80 కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

మైలవరం మండలం వెల్వడం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ్ ఐఏఎస్‌తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలను వర్చువల్‌గా వీక్షించారు. రైతుల హర్షధ్వానాల మధ్య పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రైతులతో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు మూడో విడతగా రూ.6 వేల చొప్పున అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.14 వేల చెల్లించగా, నేడు ఇచ్చిన రూ.6 వేలతో కలిపి ఒక్కో రైతుకు మొత్తం రూ.20 వేల సాయం అందించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద మైలవరం నియోజకవర్గంలో రూ.12.10 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతుండగా దాదాపు 30,241 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన కింద రూ.4.70 కోట్లు 23,503 మంది రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు తెలిపారు. ఈ రెండు పథకాల కింద కలిపి మొత్తం రూ.16.80 కోట్లు మూడో విడతగా రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం రైతులకు అదనపు సాయం అందిస్తోందని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఈ పథకం ద్వారా మూడు విడతల్లో మొత్తం రూ.56.62 కోట్లను రైతులకు అందజేసినట్లు తెలిపారు. రైతుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద నియోజకవర్గంలో ప్రతి నెల 42 వేల మందికి రూ.18.16 కోట్లు చెల్లిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 21 నెలల్లో రూ.381.36 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం కింద 40 వేల మందికి రూ.60.36 కోట్లు, ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద 2,885 మందికి రూ.4.33 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ.446.05 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వ్యవసాయానికి కిసాన్ డ్రోన్లను 80 శాతం సబ్సిడీపై అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.

మైలవరం నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద పల్లెల్లో రహదారుల అభివృద్ధికి రూ.32.92 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొన్ని రహదారులు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. మైలవరం–వెల్వడం రోడ్డును కూడా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News