ప్రజల గుండెల్లో చెరగని ముద్ర బోడేపూడిదే
29వ వర్ధంతి సభలో సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్
ఎర్రుపాలెం, ఆగస్టు 5 (న్యూస్):
అమరజీవి బోడేపూడి వెంకటేశ్వరరావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడని సీపీఎం ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ అన్నారు. బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవన్లో నిర్వహించిన స్మారక సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ఎర్రుపాలెం శాఖ కార్యదర్శి దూదిగం బసవయ్య అధ్యక్షత వహించారు.
బోడేపూడి వెంకటేశ్వరరావు జీవితం ఓ తెరిచిన పుస్తకమని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ మధిర ఎమ్మెల్యేగా రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి అంటే అధికార కేంద్రాల్లో ఉండటం కాదని, సాగర్ జలాల సాధన కోసం కాల్వల వెంట తిరిగి రైతుల కోసం పోరాడిన నాయకుడని గుర్తుచేశారు.
మంచినీటి సదుపాయం, ఇళ్ల స్థలాల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో రాజకీయాలకు అతీతంగా సేవలందించిన నిస్వార్థ నాయకుడు బోడేపూడి అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ చేపట్టే ప్రతి ప్రజా, రైతాంగ పోరాటానికి ఆయన జీవితం నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు విత్తనాలు, గిట్టుబాటు ధరలు, ఎరువులు, సబ్సిడీల నుంచి క్రమంగా దూరమవుతున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రభావంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గామసు జోగయ్య, నాగులవంచ వెంకట రామయ్య, నక్కా పుల్లారావు, గొబ్బూరి కృష్ణంరాజు, అంజయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి