వ్యసన రహిత భారత నిర్మాణానికి యువత ముందుకు రావాలి. మాదకద్రవ్యాల నిర్మూలనలో బ్రహ్మకుమారీల సేవలు అభినందనీయం: సీఐ అర్జున్
వ్యసన రహిత భారత నిర్మాణానికి యువత ముందుకు రావాలి. మాదకద్రవ్యాల నిర్మూలనలో బ్రహ్మకుమారీల సేవలు అభినందనీయం: సీఐ అర్జున్
Editor Desk
భువనగిరి, ఆగస్టు 4 సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారతదేశాన్ని వ్యసన రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, యువత బాధ్యతగా ముందుకు రావాలని భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యేశమోని అర్జున్ పిలుపునిచ్చారు.
భారత ప్రభుత్వం, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నశాముక్త్ భారత్–10 కోట్ల ప్రతిజ్ఞల మెగా క్యాంపెయిన్’ కార్యక్రమాన్ని మంగళవారం భువనగిరిలోని కృషి ఐటీఐ క్యాంపస్లో దరిపల్లి అనంతరాములు ఆడిటోరియంలో సీఐ అర్జున్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాలే రేపటి భవిష్యత్తును నిర్దేశిస్తాయని అన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేలా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. సిగరెట్, గుట్కా, తంబాకు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చిన్న పొరపాట్లు జీవితాన్ని చీకటిమయం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు వ్యసన విముక్తి కోసం బ్రహ్మకుమారీస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
భువనగిరి టౌన్ ఎస్ఐ కర్నాటి లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచి స్నేహితులను ఎంచుకోవడంతో పాటు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటేనే ఉన్నత అవకాశాలు దక్కుతాయని చెప్పారు.
బ్రహ్మకుమారీస్ భువనగిరి ఇన్చార్జి చంద్రావతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి వ్యక్తిలోని కామం, క్రోధం, లోభం, అహంకారం, మద్యం, జూదం, గుట్కా, తంబాకు వంటి దుర్గుణాలను జయించినప్పుడే నిజమైన రావణ సంహారం జరిగినట్లవుతుందని పేర్కొన్నారు.
కృషి ఐటీఐ, వాత్సల్య విద్యాసంస్థల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు.
కార్యక్రమంలో కృషి ఐటీఐ, వాత్సల్య విద్యాసంస్థలు, శ్రీ వాగ్దేవి జూనియర్ అండ్ ఒకేషనల్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యసన రహిత భారత నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు బీకే బాలేశ్వర్, బీకే చారి, బీకే రామేశ్వర్, బీకే జహంగీర్ కుమార్, బీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి