తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపును పారదర్శకంగా చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపును పారదర్శకంగా చేయాలి
Biksham
పెన్షన్ల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల, పోడు భూములకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ డిమాండ్
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపును పూర్తిస్థాయి పారదర్శకతతో చేపట్టి, పైరవీలకు తావులేకుండా ఏబీసీడీలుగా వర్గీకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సివై పుల్లయ్య డిమాండ్ చేశారు.
మంగళవారం తల్లాడ మండల కేంద్రంలో ఏనుకూరు–తల్లాడ సంయుక్త మండల కమిటీ సమావేశం ఎస్కే జానీ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సివై పుల్లయ్య మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు పెన్షన్లను వెంటనే పెంచడంతో పాటు వ్యవసాయ కార్మికులు, ఆటో కార్మికులకు ప్రకటించిన పెన్షన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, జరిగిన ఘటనలపై స్వతంత్ర న్యాయమూర్తుల బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ప్రతి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను సకాలంలో చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించకపోవడం వల్ల విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో మిగిలిన పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, గోదావరి జలాలను పాలేరు వరకు మళ్లించే చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.7,500 జీవన భృతి, ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు.
రైతు పంటలకు సమగ్ర మద్దతు ధరలు ప్రకటించాలని, నాలుగు వ్యవసాయ చట్టాలను పరోక్షంగా అమలు చేసే చర్యలను నిలిపివేయాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి. రామయ్య, వైరా డివిజన్ కార్యదర్శి ఎస్కే లాల్ మియా, డివిజన్ నాయకులు ఎలదండి బాబు, పాశం అప్పారావు, డి. శ్రీనివాసరావు, ఏనుకూరు–తల్లాడ సంయుక్త మండల కార్యదర్శి కొండే వెంకటేశ్వర్లు, మండల నాయకులు గడ్డం లింకులు, ఎస్కే జానీ, గొడ్ల పుల్లమ్మ, డి. రమణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి