డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్.
Editor Desk
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే యువతకు ఉజ్వల భవిష్యత్.
నల్లగొండ, ఆగస్టు 4: మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా కలిసికట్టుగా కృషి చేయాలని, డ్రగ్స్కు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మంగళవారం నిర్వహించిన 'నషా ముక్త్ భారత్–మిషన్ స్పందన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాదక ద్రవ్య వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాలం మారుతున్న కొద్దీ యువతలో వ్యసనాల రూపం కూడా మారుతోందన్నారు. మద్యం, సిగరెట్లతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ వ్యసనం, డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు డ్రగ్స్ సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా లభిస్తున్నాయని పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల బారిన పడితే వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని, యువత కెరీర్ పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం తెలిసినా, ఎవరైనా బలవంతం చేసినా లేదా విక్రయిస్తున్నా వెంటనే 1908 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం సాధించాలంటే యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. సమాజంలో చైతన్యం పెంచేందుకు కృషి చేస్తున్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాల సేవలను అభినందించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్ను ఆవిష్కరించారు.
అదనపు ఎస్పీ రమేష్ విద్యార్థులతో మాదక ద్రవ్య వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నల్లగొండ ఇన్చార్జి రాజయోగి ధనలక్ష్మి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది యువతతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ వ్యసనం కూడా ప్రమాదకరమని, ఆగస్టు 6 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, జిల్లా మహిళా–శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్యాధికారి డా. కె. రాహుల్, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఆర్. మదన్ మోహన్, డా. వెల్దండి శ్రీధర్, కుమారి మోనిక, లెఫ్టినెంట్ సీహెచ్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ అధికారులు, ఎన్సీసీ క్యాడెట్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి