ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Harish K
దేశంలో రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు తీవ్రంగా విమర్శించారు. కోదాడలోని సుందరయ్య భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూధరల పెరుగుదల కారణంగా పేదలు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
వంట నూనె, పప్పుధాన్యాలు, బియ్యం, కూరగాయలు, పాలు, గుడ్లు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. ప్రజల ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయని, దీనివల్ల కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ ఛార్జీలు, బస్సు చార్జీలు, విద్య, వైద్యం, గృహ అద్దెలు, ఇతర సేవల ఖర్చులు కూడా భారీగా పెరగడంతో ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ధరల పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎటువంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరే విధానాలను అమలు చేస్తూ సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు.
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా పౌర సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని, పేద కుటుంబాలకు రేషన్ ద్వారా మరిన్ని నిత్యావసర వస్తువులను అందించాలని కోరారు.
వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పేద మరియు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు కనీస వేతనాలను పెంచాలని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. ధరల నియంత్రణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రజలకు ఉపశమనం కల్పించకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని మట్టిపెల్లి సైదులు హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ, సిఐటియు పట్టణ కార్యదర్శి మిట్ట గనుపుల ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జంగపల్లి శ్రీను పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి