నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ గడువు పొడిగింపు..
నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ గడువు పొడిగింపు..
NM Yadav
ఎంజియూ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు, ఏజెన్సీ నిర్వాహకులు..
రోస్టర్, రిజర్వేషన్లు పాటించకుండా అక్రమ నియామకాలపై విచారణకు డిమాండ్...
నల్గొండ : నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజియూ)లో ఔట్సోర్సింగ్ సేవల టెండర్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పలు ఏజెన్సీల నిర్వాహకులు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఔట్సోర్సింగ్ సేవల నిమిత్తం ఇటీవల అధికారులు టెండర్ ప్రక్రియ చేపట్టారని తెలిపారు. అర్హత కలిగిన పలు ఏజెన్సీలు టెండర్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, గతంలో సేవలు అందించిన భార్గవి ఎంటర్ప్రైజెస్కే లబ్ధి చేకూర్చేలా విశ్వవిద్యాలయ అధికారులు సహకారం అందించారని ఆరోపించారు. టెండర్ నిబంధనలను పక్కనపెట్టి సదరు ఏజెన్సీకే మరో సంవత్సరం పాటు గడువు పొడిగించడం ఏమాత్రం తగదన్నారు.
రిజర్వేషన్లు, రోస్టర్ పక్కనపెట్టి అక్రమాలు..
గతంలో ఇదే ఏజెన్సీ ద్వారా చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాలలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో 100 పాయింట్ల రోస్టర్ విధానాన్ని, రిజర్వేషన్ నిబంధనలను పాటించలేదని పేర్కొన్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మార్గదర్శకాలతో పాటు క్రీడాకారులు, మాజీ సైనికుల (Ex-Servicemen) కోటాను సైతం అమలు చేయకుండా అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘించిన భార్గవి ఎంటర్ప్రైజెస్పై వెంటనే సమగ్ర విచారణ జరిపి, సంబంధిత ఏజెన్సీని బ్లాక్లిస్ట్లో పెట్టాలని, వర్సిటీలో పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించాలని వారు రిజిస్ట్రార్ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏజెన్సీ నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి