గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలి.
ఆహార సరఫరాలో నిర్లక్ష్యం సహించం..
కాంట్రాక్టర్పై చర్యలు తప్పవు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజాపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన గత పర్యటనలో సూచించిన పనుల పురోగతిని పరిశీలించారు.
హాస్టల్లో కిటికీల మరమ్మతులు, డోర్ల ఫిట్టింగ్, మెష్ ఏర్పాటు, వర్షపు నీటి లీకేజీల నివారణ పనులను పరిశీలించిన కలెక్టర్, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్టల్లోని కొన్ని మరుగుదొడ్లు బ్లాక్ అయి వినియోగానికి అనుకూలంగా లేకపోవడాన్ని గుర్తించి, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్కు, మెనూ ప్రకారం అందించాల్సిన గుడ్లు, చికెన్ వంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా అందడం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో వెంటనే సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి ఒప్పందం ప్రకారం సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ విషయంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, ఇకపై సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్ను బ్లాక్లిస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, గోడలు, పైకప్పుల నుంచి ఊడిపోతున్న పెచ్చులను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని గురుకుల కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు అనుభవజ్ఞులైన లెక్చరర్ డాక్టర్ రాజును నియమించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్, ఎంఆర్వో, ఎంపీడీఓ నాగవేణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి