ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన ఉదయం అల్పాహారం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సమావేశమై కార్యక్రమ అమలుపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 28 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే ప్రణాళికపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యాభివృద్ధికి తోడ్పాటుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో అత్యున్నత ప్రమాణాలతో సెంట్రలైజ్డ్ కిచెన్ను ఏర్పాటు చేసి, ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పరిశుభ్రమైన అల్పాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక, నిర్వహణ అంశాలపై ఫౌండేషన్ ప్రతినిధులతో సానుకూలంగా చర్చించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంక్షేమానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడటంతో పాటు, పోషకాహార లోపాన్ని తగ్గించి విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి