రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి
Biksham
12న కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి : రైతు సంఘం పిలుపు
యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలోని రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా రైతులను నిరాశపరుస్తోందని విమర్శించారు. యాసంగి సీజన్ ముగిసి త్వరలోనే కోతల కాలం ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. నిధులు రాకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తైన తరువాత ఫిబ్రవరి పదిహేడున రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదని అన్నారు. ప్రభుత్వం స్పందించేలా చేయడానికి ఈ నెల 12న సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యాప్ కారణంగా యూరియా కొనలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొలిశెట్టి యాదగిరిరావు, కొప్పుల రజిత, అదిరే అప్పయ్య, చిట్టెంకి యాదగిరి, ఇట్టమల్ల స్టాలిన్, వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి