పూత రాలిపోవడంతో కుంగిన రైతు… మామిడి తోటలోనే విషాదాంతం
పూత రాలిపోవడంతో కుంగిన రైతు… మామిడి తోటలోనే విషాదాంతం
GADDAM JAGANMOHAN REDDY
మంచిర్యాల జిల్లా, చెన్నూర్:
వాతావరణ మార్పులు మరో రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మామిడి తోటలో ఆశల పంట పండుతుందని ఎదురు చూసిన రైతు, పూత మొత్తం రాలిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చెన్నూర్లో వెలుగుచూసింది.
కొత్త గూడెం కాలనీకి చెందిన ఎల్లబోయిన మల్లేశ్ (47)కు రెండు ఎకరాల మామిడి తోట ఉంది. ఈ సీజన్లో దండిగా పూత రావడంతో మంచి దిగుబడి వస్తుందని కుటుంబసభ్యులతో ఆనందం పంచుకున్నాడు. కానీ అనూహ్యంగా మారిన వాతావరణ పరిస్థితులు అతని ఆశలపై నీళ్లు చల్లాయి. తోటలోని పూత పూర్తిగా రాలిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
పంటను కాపాడేందుకు పిచికారీలు చేసినా ఫలితం లేకపోవడం, పెట్టుబడులు తిరిగి రాకపోవడం అతన్ని ఆర్థికంగా కుంగదీశాయి. అప్పుల భారం, భవిష్యత్తుపై అనిశ్చితి కలిసి మల్లేశ్ను మానసికంగా ఒత్తిడికి గురిచేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
శనివారం సాయంత్రం తోటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మల్లేశ్ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తోటకు వెళ్లి చూడగా పురుగుమందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు, అక్కడి నుంచి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మల్లేశ్ మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. పంట నష్టాలు, వాతావరణ అస్థిరత రైతు జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, పంట నష్టంపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
(గమనిక: రైతు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.)

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి