“పులి బక్కపడినా చారలు పోవు… తెలంగాణ కోసం పోరాటం ఆగదు” జన్మదిన వేడుకల్లో ఈటల రాజేందర్
“పులి బక్కపడినా చారలు పోవు… తెలంగాణ కోసం పోరాటం ఆగదు” జన్మదిన వేడుకల్లో ఈటల రాజేందర్
స్థానికం బృందం
శామీర్పేట్: జన్మదిన వేడుకల సందర్భంగా తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ భావోద్వేగంగా మాట్లాడారు. “ఎన్నో దెబ్బలు తగిలాయి.. అనేక గాయాలు అయ్యాయి. అయినా పులి బక్కపడినంత మాత్రాన పులి చారలు పోవు” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చిందించి, పోరాడి సాధించుకున్నామని ఆయన అన్నారు. “తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తాను. మాకు శక్తి ఇచ్చేది ప్రజలే” అని స్పష్టం చేశారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాదిమంది తనను కలవడం ఆనందంగా ఉందని ఈటల చెప్పారు. “పార్టీలు, సిద్ధాంతాలు వేరు అయినా సమాజ హితం కోరుకునే వారు నా వద్దకు రావడం గర్వకారణం. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మానవత్వంతో ప్రజలు కలిసివచ్చారు” అని అన్నారు.
నాయకుడికి గౌరవం, బాధ్యత ఉండాలని, తన హోదాకు తగిన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. “ప్రతి విషయానికి వెంటనే స్పందించకపోయినా.. పరిష్కారం కోసం ఆలోచన మాత్రం కొనసాగుతుంది” అని చెప్పారు.
తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ, ఉప్పల్ రైల్వే ట్రాక్లపై జరిగిన ఘటనలు, మానుకోటలో జరిగిన పోరాటాలను ప్రస్తావించారు. “మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టే. మేము ఒకరి మేలు కోరేవాళ్లం తప్ప కీడు కోరేవాళ్లం కాదు” అని స్పష్టం చేశారు.
ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ, “డబ్బులతో వార్తలు మేనేజ్ చేయవచ్చు కానీ అంతిమ విజయం ధర్మానిదే” అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దోపిడీ కోసం కాదని, ప్రజల కోసం సాధించుకున్నదని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నవారిపై ప్రజలు సరైన సమయంలో స్పందిస్తారని, ఇప్పటికే ప్రజలు అవగాహన పెంచుకున్నారని చెప్పారు.
“పదవుల కోసం విలువలు వదులుకునే వాళ్లం కాదు. ప్రలోభాలకు లొంగే వాళ్లం కాదు. ప్రజల పక్షాన, ధర్మం – న్యాయం పక్షాన నిలబడతాం” అని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి