పోచంపల్లి చేనేతకు ప్రపంచ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం. తుమ్మల నాగేశ్వర రావు
పోచంపల్లి చేనేతకు ప్రపంచ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం. తుమ్మల నాగేశ్వర రావు
Editor Desk
పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ‘థ్రెడ్ పోచంపల్లి’ చేనేత ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ, చేనేత-జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం హైటెక్స్లో ప్రారంభించారు. ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది.
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, పోచంపల్లి ఇక్కత్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జీఐ ట్యాగ్ ద్వారా పోచంపల్లి చేనేత కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండున్నర సంవత్సరాల్లో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు.
గ్లోబల్ మార్కెట్ పోటీని ఎదుర్కొనేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేశామని, చేనేత కుటుంబాల పిల్లలకు ఆధునిక డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పోచంపల్లి నేతన్నల ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను నేసి ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పోచంపల్లి ఖ్యాతి గడించిందని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే ఒక నేతన్న కుటుంబానికి అండగా నిలవడమేనని అన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రదర్శన ద్వారా చేనేత కార్మికులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కరరావు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి