హైదరాబాద్
తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో సినీ నటుడు చిరంజీవి కుటుంబానికి ఇప్పటికీ గౌరవం ఉందని, అయితే రాజకీయ నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ చరిత్రపై విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.
తెలంగాణ సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు పోరాడారని, అమరుల త్యాగాలను ఎవరూ విస్మరించరాదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో ముందుకు సాగుతున్న తరుణంలో రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించరాదని సూచించారు.
తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఉద్యమకారులు తగిన విధంగా స్పందిస్తారని జోగు అంజన్న స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి