అమీర్పేటలో అగ్నికీలలు.. కోచింగ్ సెంటర్లో చిక్కుకున్న విద్యార్థుల రక్షణ
అమీర్పేటలో అగ్నికీలలు.. కోచింగ్ సెంటర్లో చిక్కుకున్న విద్యార్థుల రక్షణ
Komidala Mahender reddy
హైదరాబాద్, అమీర్పేట: నగరంలోని విద్యా కేంద్రంగా పేరొందిన అమీర్పేట మైత్రివనం సమీపంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలోని ఓ కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. భవనం చుట్టుపక్కల అనేక కోచింగ్ సెంటర్లు ఉండటం, సంఘటన సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడ ఉండటం కలకలం రేపింది.
మంటలు చెలరేగిన వెంటనే భవనంలోని పలువురు విద్యార్థులు పై అంతస్తుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అత్యవసరంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరోవైపు స్థానికులు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి నిచ్చెనల సాయంతో విద్యార్థులను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సమన్వయంతో సుమారు 60 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాథమిక విచారణలో భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫాస్ట్ఫుడ్ దుకాణం వద్ద నుంచి మంటలు వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో అమీర్పేట ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాద సమయంలో భవనంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు భవన భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక ఏర్పాట్లపై కూడా విచారణ జరుపుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి