పిత్తాశయ రాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు
పిత్తాశయ రాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు
Editor Desk
నల్గొండ, జూలై 8: పిత్తాశయ రాళ్ల (గాల్ బ్లాడర్ స్టోన్స్) సమస్య ప్రస్తుతం వయస్సు, లింగ భేదం లేకుండా అన్ని వర్గాల వారిలో పెరుగుతోందని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని యశోద హాస్పిటల్స్, సోమాజిగూడకు చెందిన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. శ్రీమన్నారాయణ సూచించారు.
నల్గొండలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ సమస్య ప్రధానంగా 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించేదని, ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు నమోదవుతోందన్నారు. పిల్లల్లో జంక్ ఫుడ్, తగినంత నీరు తాగకపోవడం, కొన్ని రక్త సంబంధిత వ్యాధులు, పెద్దల్లో అధిక కొవ్వు పదార్థాలు, బయట ఆహారం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒకేసారి ఎక్కువగా భోజనం చేయడం, ప్రసవానంతర మార్పులు ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు.
గ్యాస్ సమస్య, కుడివైపు పై పొత్తికడుపు నొప్పి, వెన్నునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయరాదన్నారు. చికిత్స ఆలస్యమైతే కామెర్లు, ప్యాంక్రియాటైటిస్, సెప్సిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పిత్తాశయ రాళ్లకు శాశ్వత పరిష్కారం శస్త్రచికిత్సేనని, ప్రస్తుతం లాపరోస్కోపిక్, రోబోటిక్ విధానాల్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సతో తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం నెల రోజుల పాటు వేయించిన, అధిక నూనె పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పిత్తాశయ రాళ్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా అరుదని, సకాలంలో చికిత్స తీసుకుంటే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చన్నారు.
సమావేశంలో యశోద హాస్పిటల్స్ మేనేజర్ ఉమేష్, అసిస్టెంట్ మేనేజర్ వినోద్, పాత్రికేయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి