అర్వపల్లిలో కాంగ్రెస్ వర్గపోరు రగిలింది..!
అర్వపల్లిలో కాంగ్రెస్ వర్గపోరు రగిలింది..!
Komidala Mahender reddy
ఎమ్మెల్యే సామేలు వర్గం–ఎంపీ చామల, దామోదర్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్తో ఉద్రిక్తత
అర్వపల్లి, జూలై 8: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల నియామకాల వ్యవహారం చిచ్చు రేపడంతో ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మరియు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.పార్టీ మండల అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యే సామేలు ఏకపక్ష ధోరణి అవలంబించారని ఆరోపిస్తూ పలువురు పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ అభ్యంతరాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీ చామల, మాజీ మంత్రి దామోదర్రెడ్డి వర్గీయులు గాంధీభవన్కు బయలుదేరినట్లు సమాచారం.అయితే అర్వపల్లి మండల కేంద్రంలో వీరు ప్రయాణిస్తున్న బులెరో వాహనాన్ని ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు అడ్డుకుని రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా, పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసు సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అర్వపల్లి మండల కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటనతో తుంగతుర్తి కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగ ఘర్షణలకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి