ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్
ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్
Biksham Goud
జిల్లా ఎస్పీ కె. నరసింహ
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ఫోన్ చేస్తే ఇంటికే పోలీసులు వచ్చి బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించి అక్కడి నుంచే కేసులు నమోదు చేసే నూతన కార్యాచరణను సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా అమలు చేస్తుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది వారి నివాసానికి వెళ్లి పిర్యాదు స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసి భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు.ముఖ్యంగా మహిళా పిర్యాదుల విషయంలో మహిళా పోలీస్ సిబ్బంది వెంటనే బాధితుల వద్దకు చేరుకుంటారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, మహిళలు, బాలలు, దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, భయాందోళనలతో బయటకు రాలేని వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.
శారీరక దాడులు, అట్రాసిటీ చట్టం కింద కేసులు, గృహహింస, బాల్య వివాహాలు, ర్యాగింగ్, మైనర్ వేదింపులు వంటి కేసుల్లో ఈ విధానం ద్వారా బాధితులకు వెంటనే సహాయం అందుతుందని అన్నారు. ఈ నూతన ప్రణాళిక అమలుకు సంబంధించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి