పెద్దకాపర్తి శివారులో రైన్బో ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం
పెద్దకాపర్తి శివారులో రైన్బో ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం
Komidala Mahender reddy
అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్తో 40 మంది ప్రయాణికులు సురక్షితం.. సామాన్లు దగ్ధం.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న రైన్బో ట్రావెల్స్కు చెందిన బస్సు (NL07 B 0886)లో శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు ఇంజిన్ భాగంలో మంటలు ప్రారంభమయ్యాయి. పొగలు, మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను బయటకు దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడగా, ప్రయాణికుల సామాన్లు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఇంజిన్లో సాంకేతిక లోపం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే ప్రయాణికులు తమ విలువైన సామాన్లు కోల్పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి