పెన్షన్లో కేంద్ర వాటా రూ.5 వేలకు పెంచాలి: నంబు రాజన్
పెన్షన్లో కేంద్ర వాటా రూ.5 వేలకు పెంచాలి: నంబు రాజన్
Editor Desk
వికలాంగుల హక్కులను కుదించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్ట సవరణలను దేశవ్యాప్తంగా అడ్డుకుంటామని ఎన్పీఆర్డీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంబు రాజన్ హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల సందర్భంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్, మతోన్మాద విధానాలను అమలు చేస్తోందని, పేదల కంటే పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని విమర్శించారు. వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించకుండా యూడీఐడీ కార్డుల పంపిణీ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
వికలాంగుల పెన్షన్లో కేంద్ర ప్రభుత్వ వాటా ప్రస్తుతం రూ.300 మాత్రమే ఉందని, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని దానిని రూ.5 వేలుకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డులు జారీ చేయాలని కోరారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016 అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో జాప్యం చేస్తోందన్నారు. పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు పాస్, సహాయ పరికరాల పంపిణీ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వికలాంగులు, వారి పిల్లలకు 5 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని కోరారు.
సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉపేందర్, సహాయ కార్యదర్శి జె. రాజు, భువనగిరి జిల్లా అధ్యక్షుడు సూరపంగా ప్రకాశ్, కోశాధికారి లలితతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి