విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
Krishna
జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రజా అవసరాల రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా అధికారులు, వివిధ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సీఎస్ఆర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి జిల్లాకు పరిశ్రమల నుంచి వచ్చిన సీఎస్ఆర్ నిధులు, వాటి వినియోగం, ప్రస్తుత సంవత్సరానికి ప్రతిపాదించిన పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను ప్రాధాన్యతతో కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, వంటశాలలు, భోజనశాలలు, అదనపు తరగతి గదులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్య వసతుల కల్పనకు నిధులు వినియోగించాలని తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతిపాదిత పనుల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎస్ఆర్ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడేలా పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి