భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
Editor Desk
జిల్లాలో భూగర్భ జలాల లభ్యతను పెంచేందుకు నీటి సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2025–26 నీటి సంవత్సరానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జలాల అంచనా కమిటీ తొలి సమావేశం శనివారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, అటవీ, నీటిపారుదల, ప్రణాళిక శాఖల అధికారులతో భూగర్భ జలాల అంచనా ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి అవసరమైన మౌలిక సమాచారాన్ని శాఖలు సమయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో సాధారణం కంటే 65 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ జనవరి నుంచే నీటి సమస్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. భూగర్భ జలాల లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల ఎంపిక చేసుకుంటే నష్టాలను నివారించవచ్చన్నారు. నవంబర్లో భూగర్భ జలాలు మూడు మీటర్ల లోతులో, మే నెలలో ఐదు మీటర్ల లోతులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అత్యధిక భూగర్భ జల వినియోగ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పంట మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు. రెండో పంటగా బోర్ల కింద వరి సాగును తగ్గించాలని రైతులకు సూచించారు.
సమావేశంలో భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూగర్భ జలాల అంచనా విధానం, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. అనంతరం 2024–25 సంవత్సరానికి సంబంధించిన భూగర్భ జలాల అంచనా నివేదికను జిల్లా కమిటీ ఆవిష్కరించింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి