ప్రశ్నిస్తే అరెస్టులా..? ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన
ప్రశ్నిస్తే అరెస్టులా..? ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన
Editor Desk
చలో సచివాలయం'లో ఉద్రిక్తత.. ఏఐఎస్ఎఫ్ నేతల అరెస్టు
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: ఉప్పుల శాంతికుమార్
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్తో పాటు పలు వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన 'చలో సచివాలయం' కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. సచివాలయం వైపు భారీగా తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకు దిగిన విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై అరెస్టులతో సమాధానం చెప్పడం దురదృష్టకరమని విమర్శించారు.
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలపై ఆధారపడి ఉందని, నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
"విద్యా శాఖకు మంత్రి కరువయ్యారా..?" అంటూ ప్రభుత్వం తీరుపై ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి చిప్పలపల్లి నవీన్, నాయకులు వంశీకుమార్, ప్రశాంత్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.
విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి