ఎస్ఐఆర్ ఓటర్ల గణన ఫారాల నమోదుకు శ్రీకారం
ఎస్ఐఆర్ ఓటర్ల గణన ఫారాల నమోదుకు శ్రీకారం
Biksham
అధికారులకు ఘన స్వాగతం పలికిన కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్
భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డు పిల్లలమర్రిలో ఓటర్ల గణన ఫారాల నమోదుకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వార్డులోని గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్రాజ్, సూర్యాపేట డిప్యూటీ తహసీల్దార్ లాల్ నాయక్లకు 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం అధికారుల సమక్షంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన వారు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్రాజ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావడం తన బాధ్యతగా భావించాలని అన్నారు. యువత, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, వార్డులో ఒక్క అర్హుడూ ఓటరు జాబితాకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులు, వార్డు నాయకులు, యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగస్వాములయ్యారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి