దళితుల స్మశానంపైనా కబ్జా..! ముత్తిరెడ్డిగూడెంలో ఆక్రమణలపై ఆగ్రహం
దళితుల స్మశానంపైనా కబ్జా..! ముత్తిరెడ్డిగూడెంలో ఆక్రమణలపై ఆగ్రహం
Editor Desk
సర్వే చేసి రక్షణ గోడ నిర్మించాలి.. ఆక్రమణదారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్
భువనగిరి, జూలై 13: భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో దళితుల స్మశాన వాటిక ఆక్రమణకు గురవుతోందని గ్రామానికి చెందిన దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్మశాన భూమిని వెంటనే సర్వే చేసి ఆక్రమణలను తొలగించడంతో పాటు రక్షణ గోడ నిర్మించాలని కోరుతూ సోమవారం మండల తహసీల్దార్ జగన్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కొండమడుగు సార్ నర్సింహ, కొండమడుగు రాములు మాట్లాడుతూ.. గ్రామంలో 100కుపైగా దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, గత 200 ఏళ్లుగా సర్వే నంబర్ 285లోని రెండు ఎకరాలకు పైగా ఉన్న భూమిలో తమ పూర్వీకుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2001లో అప్పటి ఎమ్మార్వో సర్వే నిర్వహించి 20 గుంటల స్మశాన భూమిని గుర్తించి హద్దురాళ్లు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఆ భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైందని ఆరోపించారు.
కొంతమంది రైతులు 20 గుంటల స్మశాన భూమిని కేవలం ఏడు గుంటలేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అంతేకాకుండా స్మశానంలోని గోరీలను ధ్వంసం చేస్తూ, పంట భూమిలో కలుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల స్మశానాన్ని ఆక్రమించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.
దళితుల స్మశాన భూమిని, అక్కడికి వెళ్లే దారిని ఆక్రమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ వెంటనే భూమిని సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని, గ్రామ పంచాయతీ నిధులతో స్మశానానికి ప్రహరీ గోడ లేదా ఫెన్సింగ్, శాశ్వత రహదారి, తాగునీరు, స్నానాల సౌకర్యం, దింపుడు గల్లం ఏర్పాటు చేయాలని కోరారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో వార్డు సభ్యుడు కొండమడుగు అశోక్తో పాటు కొండమడుగు చంద్రయ్య, పోశయ్య, రవి, సాయిలు, స్వామి, కుమార్, ప్రశాంత్, రామనర్సింహ, కాసారం మల్లయ్య, వంటల స్వామి, పల్లెర్ల మల్లేశం, బూరుగు యాదగిరి, బోనగిరి బాలయ్య, గంధమల్ల బాలరాజు, పల్లెపాటి పాండు, కర్ణాకర్, కర్రె మధు, బుద్ధ విరాజ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి