పర్మిషన్ లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ.
పర్మిషన్ లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ.
Editor Desk
రామన్నపేట: ప్రభుత్వ అనుమతులు లేకుండా సీబీఎస్ఈ పేరుతో ప్రచారం చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్పై వెంటనే చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ మండల విద్యాధికారి (ఎంఈఓ)కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్కుమార్ మాట్లాడుతూ.. అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. ఇంటర్నేషనల్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ప్రతి పాఠశాల ఫీజు వివరాలను పారదర్శకంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో స్టేషనరీ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.
పర్మిషన్ లేని పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని, మండల విద్యాధికారి కనుసైగల్లోనే ఇలాంటి పాఠశాలలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ద అక్షిత, మండల నాయకులు భూక్య సంతోష్, మామిడి నవీన్, ఏటెల్లి నిషితేజ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి