ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ
Editor Desk
భువనగిరి, జూలై 6: ప్రభుత్వ పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సోమవారం కలెక్టరేట్ను ముట్టడించింది. అనంతరం పరిపాలన అధికారి అంజిరెడ్డికి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, జిల్లా కార్యదర్శి లావుడియా రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రతిపాదనను ఉపసంహరించుకుని జనాభా ప్రాతిపదికన కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, సహాయ కార్యదర్శులు తిగుల్ల శ్రీనివాస్, పుట్టల ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు నేహాల్, ప్రసన్న, ఉదయ్, అరవింద్, లత, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి