నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
Editor Desk
ఎమ్మిగనూరు, జూలై 6: ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, రైతులను మోసం చేస్తున్న ఫర్టిలైజర్ షాపులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సేన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎమ్మిగనూరు వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ, పట్టణంలోని పలువురు ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అలాగే లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించడం, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, రైతులకు బిల్లులు ఇవ్వకుండా అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ అక్రమాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పంట దిగుబడులు తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి ఫర్టిలైజర్ దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడుతున్న షాపులను వెంటనే సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మండలంలోని అన్ని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నాణ్యత లేని వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాన్ని పూర్తిగా అరికట్టాలని వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో బహుజన సేన సమితి ఎమ్మిగనూరు నియోజకవర్గ కార్యనిర్వాహక సభ్యులు సూరి, ముని, కేశన్న, రాముడు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి