ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం – బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం – బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
స్థానికం బృందం
నకిరేకల్: ప్రభుత్వ నిర్లక్ష్యంతో మృతి చెందిన విద్యార్థి బాల ఆకాష్ కుటుంబానికి భారత రాష్ట్ర సమితి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బంధనాథం బాల ఆకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
భువనగిరి శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాల ఆకాష్ ఈ నెల 15న పాఠశాల సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లి ఈత రాక మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమాచారం ఇవ్వడంతో గురువారం రాత్రి కేటీఆర్ రాయపురం చేరుకుని బాల ఆకాష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా సంబంధిత మైనారిటీ గురుకుల పాఠశాల కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్, బాలుడి మృతికి బాధ్యులైన పాఠశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించడంతో పాటు బాల ఆకాష్ తండ్రి అంతోనిరాజుకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
బాలుడి సోదరి మధువన్సీతను అక్కున చేర్చుకుని, “నేను నీకు అన్నగా భావించు… నువ్వు ఎంత వరకు చదివితే అంత వరకు ఉన్నత విద్య ఖర్చులన్నీ నేనే భరిస్తా” అంటూ భావోద్వేగ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి