Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:20 AM

పదో తరగతి వార్షిక పరీక్షల కేంద్రాల పరిశీలన

పదో తరగతి వార్షిక పరీక్షల కేంద్రాల పరిశీలన

పదో తరగతి వార్షిక పరీక్షల కేంద్రాల పరిశీలన
March 14, 2026 07:51 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా పరీక్షలు: జిల్లా పోలీసు అధికారి నరసింహ

సూర్యాపేట, మార్చి 14:

పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా పోలీసు అధికారి నరసింహ పరిశీలించారు. పట్టణంలోని కాకతీయ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, పోలీసు సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామని తెలిపారు. నిషేధాజ్ఞల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సమీపంలో గుంపులుగా నిలబడరాదని, శబ్ద పరికరాలు వినియోగించరాదని సూచించారు.

అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు, అంతర్జాల సేవా కేంద్రాలు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాహనాలలో పరిమితికి మించి విద్యార్థులను తరలించరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ శాఖ అధికారి రామారావు, పట్టణ ఉపనిర్వాహకులు ఐలయ్య, శివతేజ, ట్రాఫిక్ ఉపనిర్వాహకుడు సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News