నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి
GADDAM JAGANMOHAN REDDY
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, చెవి వినికిడి పరీక్ష యంత్రం, లాప్రోస్కోపీ యంత్రాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం సుమారు రూ.4 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
గత ప్రభుత్వం పేదల వైద్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించిన మంత్రి, కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి ఒక్క రూపాయి కూడా అందలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నూజివీడు నియోజకవర్గంలో సుమారు రూ.11 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించిందన్నారు.
పేదల వైద్యానికి రెండున్నర లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే సంజీవిని కార్డులు, టెలీ మెడిసిన్ సేవలను కూడా ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు.
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా సుమారు పది మండలాల ప్రజలకు సేవలు అందనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను నేటి నుంచి అందిస్తున్నామని తెలిపారు. అదనంగా సుమారు రూ.10 కోట్లతో నవజాత శిశు సంరక్షణ కేంద్రం కూడా మంజూరు అయినట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్న మంత్రి, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి