రామన్నపేట
ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో నిదానపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో, ఆర్ఐ శోభ నేతృత్వంలో జరిగిన సభలో బీఎల్వో బబ్బూరి నాగమణి గ్రామస్థులకు ఓటర్ల జాబితాపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాను గ్రామస్థుల సమక్షంలో చదివి వినిపించారు. నిదానపల్లి గ్రామ జాబితాలో మొత్తం 140 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు, ఇంటి నంబర్ తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో తప్పులు ఉంటే సంబంధిత ఫారాల ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. బోగస్ ఓట్ల తొలగింపు, అన్మ్యాపింగ్ ప్రక్రియపై కూడా అవగాహన కల్పించారు.
నోటీసులు వస్తే ఆందోళన వద్దు.
ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేసిన సందర్భంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్, రేషన్కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డుల్లో తగిన పత్రాలను సమర్పించి తమ వివరాలను ధ్రువీకరించుకోవచ్చని తెలిపారు. సందేహాలుంటే బీఎల్వో లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ అండాలు, జీపీఓ లక్ష్మి, వార్డు సభ్యులు వంగాల పూజిత, కడారి ఐలయ్య, భాషమల్ల అనిత, విబికే నారపాక హారిక, నాయకులు నారపాక రవి, రాపోలు రమేష్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి