మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రాణనష్టం సంభవించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికుల జీవితాలు మార్గమధ్యంలోనే విషాదాంతం కావడం హృదయవిదారకమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ అపార విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికీ సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి