రామగిరి మండలం సుద్దకొండపల్లి గ్రామానికి చెందిన కురుబ బిల్లే నాగరాజు తన గొర్రెల మందను కాపాడేందుకు రొద్దం మండలం పెద్దకోటిపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (28)ను గొర్రెల కాపరిగా నియమించుకున్నాడు.
ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు వ్యక్తుల సహకారంతో యజమానికి చెందిన సుమారు 81 గొర్రెలను మంద నుంచి తప్పించి, సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు తోలుకొని వెళ్లినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దొంగిలించబడిన గొర్రెల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని యజమాని తెలిపాడు.
సమాచారం అందుకున్న వెంటనే రామగిరి పోలీసులు అప్రమత్తమై, గొర్రెల కదలికలను మరియు నిందితుల ఆచూకీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల నిరంతర పర్యవేక్షణతో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గొర్రెలను గుర్తించి, సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని యజమానికి అప్పగించినట్లు సిఐ మహమ్మద్ అలీ తెలిపారు.
పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో గొర్రెలను తరలించిన వ్యక్తితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సిఐ తెలియజేశారు.
ఈ కేసులో రామగిరి ఎస్ఐ ప్రదీప్ రాజ్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శాశవళి, కానిస్టేబుళ్లు ముక్కనేశ్వర, లక్ష్మీనారాయణ రెడ్డి సమర్థవంతంగా పనిచేశారు. సమయస్ఫూర్తితో స్పందించి, గొర్రెలను త్వరితగతిన గుర్తించి సురక్షితంగా స్వాధీనం చేసుకోవడంలో వారు కీలక పాత్ర పోషించారు.
గొర్రెలు, పశువులు పెంచుకునే రైతులు మరియు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని రామగిరి పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి